డ్రంక్ అండ్ డ్రైవ్ ఐదుగురికి జైలు శిక్ష
మేడ్చల్, సెప్టెంబర్ 09: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను బుధవారం మేడ్చల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, 7వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం 14 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పరిష్కరించగా, ఐదుగురికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇందులో ఒకరికి 5 రోజుల జైలు శిక్ష, ఒకరికి 4 రోజులు, ఇద్దరికి 3 రోజుల చొప్పున, మరొకరికి 2 రోజుల జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్కు పాల్పడితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష వంటి కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

