ములుగు ప్రతినిధి (ప్రజావాణి)
ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం ములుగులోని బాల సదనం (బాలికలు) ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.చండీశ్వరి దేవి సందర్శించారు.
బాల సదనంలో ఉన్న అనాథ, పాక్షిక అనాథ బాలికలకు అందుతున్న సౌకర్యాలు, వసతుల గురించి ఆమె ఆరా తీశారు. బాలికలకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలు, భోజనం, వైద్య సౌకర్యాలు, విద్యా సదుపాయాలను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా బాలికలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని సిబ్బందిని ప్రశ్నించారు. పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.
చట్టపరమైన సహాయం అవసరమైన చిన్నారులకు న్యాయ సేవాధికార సంస్థ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బాల సదనం సిబ్బంది మరియు డిఎల్ఎస్ఏ సిబ్బంది పాల్గొన్నారు.

