జైపూర్, సెప్టెంబరు 15,ప్రజావాణి:
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ) ప్రాంగణంలో సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా రక్తనిధి కేంద్రం సహకారంతో మంగళవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సుధేష్ జాకర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి కమాండెంట్ ఛాన్స్ బార్ సర్కార్, డిప్యూటీ కమాండెంట్ మనిదీప్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ శిబిరంలో 47 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.ఈ సందర్భంగా రెడ్క్రాస్ సొసైటీ జిల్లా జనరల్ సెక్రెటరీ చందూరి మహేందర్ మాట్లాడుతూ.. మనం ఇచ్చే ఒక్క యూనిట్ రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుందన్నారు. ముఖ్యంగా తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు క్రమం తప్పకుండా రక్తం అవసరమవుతుందని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన సీఐఎస్ఎఫ్ అధికారులు, సిబ్బంది, రక్తదాతలకు రెడ్క్రాస్ సొసైటీ తరఫున ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు కాసర్ల శ్రీనివాస్, సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ బి.బాలసుబ్రమణ్యం, బ్లడ్ బ్యాంక్ వైద్యుడు డాక్టర్ బి.ప్రేమ్ సాయి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
