*గణపతి నవరాత్రి ఉత్సవాల్లో డీజే ల వినియోగంపై నిషేధం*
*ముందు జాగ్రత్తగా డీజే ఆపరేటర్లపై బైండోవర్ కేసులు*
* *మన ప్రజావాణి* మందమర్రి:- సెప్టెంబర్ 15
గణపతి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపులను శాంతియుత వాతావరణంలో, ప్రశాంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో డీజే ల వినియోగంపై నిషేధం విధించడం జరిగిందని పట్టణ ఎస్ఐ గోపతి నరేష్ తెలిపారు. మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్లో స్థానిక డిజే, సౌండ్ సిస్టం ఆపరేటర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాల వేళ శబ్ద కాలుష్యం కాకుండా చూడటం, ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులు, విద్యార్థులు, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం పోలీస్ శాఖ ముఖ్య ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. గణపతి ఉత్సవాల్లో, నిమజ్జన ఊరేగింపులలో డిజే శబ్ద వ్యవస్థల వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందని తెలిపారు. గణపతి ఉత్సవమూర్తుల స్థాపన నుండి నిమజ్జనం వరకు ఎక్కడా డిజే లను ఉపయోగించకూడదని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమించి డిజే లను ఉపయోగిస్తే, సదరు సౌండ్ సిస్టమ్ పరికరాలను సీజ్ చేయడమే కాకుండా,మండపాల నిర్వాహకులు,డిజే, సౌండ్ సిస్టం ఆపరేటర్లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.భక్తులు, గణేష్ మండలి సభ్యులు పోలీసు శాఖకు సహకరించి, పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. అనంతరం ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా, డిజే, సౌండ్ సిస్టమ్ ఆపరేటర్లను భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బిఎన్ఎస్ఎస్) కింద తగిన నివారణ చట్టాల ప్రకారం మండల తహశీల్దార్ ఎదుట ప్రవేశపెట్టి, ఫార్మల్ బైండ్-ఓవర్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈకార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, డిజే, సౌండ్ సిస్టం ఆపరేటర్లు పాల్గొన్నారు.

