*సింగరేణి అధికారుల వేధింపులకు దళిత బిడ్డ బలి*
*అక్షిత రాణి మృతి సింగరేణి అధికారుల హత్యే*
* *మన ప్రజావాణి* మందమర్రి:- సెప్టెంబర్ 15
సింగరేణి అధికారుల నిర్లక్ష్యం, లైంగిక వేధింపులకు దళిత బిడ్డ తాండ్ర అక్షిత రాణి బలైందని, ఇది ఆత్మహత్య కాదు సింగరేణి అధికారులు చేసిన హత్యేనని సిపిఐ(ఏఎం) జిల్లా కన్వీనర్ సంకె రవి, జిల్లా కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్ లు మంగళవారం ప్రకటనలో ఆరోపించారు. రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతంలో నివసిస్తూ ఎంతో కష్టపడి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యలో బిటెక్ చేసి, తన భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటూ సింగరేణి రామగుండం ఆర్జి-1 ఏరియాలోని 2 ఇంక్లైన్ గనిలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేస్తున్న దళిత బిడ్డ తాండ్ర అక్షిత రాణి జీవితాన్ని గని ఓవర్ మెన్ రవి కుమార్, నవీన్ కుమార్ లు చిదిమేశారని ఆరోపించారు. వీరికి అండగా ఉన్న సింగరేణి అధికారులైన ఏరియా జిఎం, గని మేనేజర్ ల మూలంగానే అక్షిత రాణి ఆత్మహత్య చేసుకుందన్నారు. దళిత బిడ్డపై అగ్రకుల అహంకారంతో దుర్మార్గానికి పాల్పడటమే కాకుండా ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అని, మనోవేదనకు గురైన అక్షిత రాణి ఆత్మహత్య చేసుకోవడం సింగరేణి అధికారులు చేసిన హత్యేనని ఆరోపించారు. దీనికి బాధ్యులైన రవి కుమార్, నవీన్ కుమార్ లతో పాటు వీరికి సహకరించిన ఏరియా జిఎం, గని మేనేజర్లపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార, హత్య కేసులు నమోదు చేసి, తక్షణమే అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని సింగరేణి సంస్థను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించకపోతే ఛలో గోదావరిఖని కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు.

