ఘట్కేసర్, ఆగస్టు 9: “బద్లావ్ జరూరీ హై.. మార్పు కావాలి” అనే నినాదంతో కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఘట్కేసర్ మండల కేంద్రంలో విస్తృతంగా కరపత్రాల పంపిణీ చేపట్టారు.
సీపీఐ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి అనంతరం ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కల్లూరి జయచంద్ర, సీపీఐ మండల సహాయ కార్యదర్శి సయ్యద్ ఖదీర్ నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ సెప్టెంబర్ 1న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్ పద్ధతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించాలని, మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని, కార్మికుల హక్కులను పరిరక్షించాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టి, అందరికీ సార్వత్రిక విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, దళితులు, ఆదివాసులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను అరికట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు బి. శ్రీనివాస్, ఎం. రామచంద్రయ్య, ఎం. శంకరయ్య, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎస్. ఆంజనేయులు, సత్యనారాయణ, మున్సిపల్ జిల్లా నాయకులు ఎం. రామచందర్, రామ్కుమార్, జె. రమేష్, సయ్యద్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు.


