ఘట్కేసర్, జూన్ 2 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘట్కేసర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ కేఎల్ మహేంద్రానగర్ కాలనీలో సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ నాయకుడు కామ్రేడ్ ఎల్లయ్య జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కల్లూరి జైచంద్ర మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 వసంతాలు పూర్తయినా ప్రజల ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నెరవేరలేదన్నారు. రాష్ట్ర ఏర్పాటు తమ వల్లే జరిగిందని చెప్పుకున్న అప్పటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో, పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో, రైతు సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు.
అన్ని రంగాల కార్మికుల సమస్యలు, నిరుద్యోగుల ఆవేదన, ఉద్యోగ నియామక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి శాపంగా మారాయని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయడంలో వైఫల్యం చెందడంతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా అణచివేయడం వల్లే బీఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలకుల తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రజా సేవకులుగా పనిచేయాలని, లేకపోతే ప్రజాపాలనకు అర్థం ఉండదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో విశిష్ట పాత్ర పోషించిన తెలంగాణ ముద్దుబిడ్డ, రచయిత, కవి, గాయకుడు, ఉద్యమకారుడు అందెశ్రీ మరణానంతరం ఇప్పటివరకు స్మృతివనం ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అన్నారు. వెంటనే అందెశ్రీ స్మృతివనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్.కె. అన్వర్ పాషా, చౌదరి రాము, శ్యామ్, ఎల్లయ్య, యాదగిరి, రాజు, బాలనరసింహ, రవి, విజయ, పద్మ, ప్రమీల, రాజేశ్వరి, శ్రీను, కిష్టయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు.



