ఘట్కేసర్, మే 17 : ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 266వ వారపు నిత్య పూలమాల కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ మేడ్చల్ మల్కాజిగిరి కార్యదర్శి బక్కని నర్సింగ్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
నర్సింగ్ రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ దేశంలోని పేద, పీడిత, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడని కొనియాడారు. అంటరానితనం తీవ్రంగా ఉన్న రోజుల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ విద్యను ఆయుధంగా చేసుకుని ఉన్నత చదువులు పూర్తి చేసి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారని తెలిపారు. లండన్ వంటి విదేశాల్లో న్యాయ విద్యను అభ్యసించి తిరిగి దేశానికి వచ్చి సమాన హక్కుల భారత నిర్మాణానికి కృషి చేశారని అన్నారు.
డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా భారత రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని సూచించారు. అంబేద్కర్ ఆశించిన కులరహిత సమాజ నిర్మాణం సాధించాలనే లక్ష్యంతో అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డా. మీసాల మల్లేష్, కడపోళ్ల మల్లేష్ (మాజీ కౌన్సిలర్), ఉట్కూరి అశోక్ గౌడ్, కట్కూరి నర్సింగ్రావు, ఈరిటం శ్రీనివాస్, గురజకుంట్ల నర్సింహ, ఎం నర్సింగం, వడ్కుమార్, సంతోష్, బి కిరణ్, జి రమేష్, బి కుమార్, ఎం పెంటయ్య, కె రమేష్, కడప రవి, లాజర్, నవీన్ కుమార్, మన్నే నర్సింగ్ రావు, కృష్ణంరాజు, నవీన్ చంద్ర, యెల్లేష్, సి ఉపేందర్, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



