*పూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా, ఉపాధ్యాయ దినోత్సవాలు*
ఉపాధ్యాయులకు ఘన సన్మానం.. విద్యార్థుల భవిష్యత్తుకు సహకారం అందిస్తానన్న ఏఏపీసీ చైర్మన్ మంజుల
మేడ్చల్: పూడూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం, హిందీ దివస్, ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఏఏపీసీ చైర్మన్ శ్రీమతి మంజుల పూడూరు పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి సత్కరించి, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వారు అందిస్తున్న సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల అవసరాల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యాపరమైన అంశాల్లో సహకారం అందిస్తానన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు.
ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టి, వారికి అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడి, ఉన్నత లక్ష్యాల పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. పాఠశాల పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
*విద్యార్థులు భాషల ప్రాధాన్యతను విద్యార్థులు తెలుసుకోవాలి*
పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మేడ్చల్ మండల ఎంఈఓ శ్రీ వై. శంకరయ్య మాట్లాడుతూ తెలుగు, హిందీ భాషల ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేయడం ఎంతో అవసరమన్నారు. కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం గర్వకారణమన్నారు.
అదేవిధంగా సెప్టెంబర్ 14న హిందీ దివస్ను నిర్వహించుకుంటామని, దేశ చరిత్రలో హిందీ భాషకు ఉన్న ప్రాధాన్యతను విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. వివిధ భాషలను గౌరవిస్తూ వాటి ప్రాధాన్యతను అర్థం చేసుకోవడం ద్వారా విద్యార్థుల్లో భాషా పరిజ్ఞానం పెరుగుతుందని తెలిపారు.
*సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం*
సెప్టెంబర్ 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని శంకరయ్య పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని, మంచి సమాజ నిర్మాణంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని భాషల ప్రాధాన్యత, విద్య విలువ, ఉపాధ్యాయుల సేవలను వివరించే కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్. మధుసూదన్ రెడ్డి, విజయలక్ష్మి, కే. సాయి వరప్రసాద్, టి. రమాదేవి, కే.వి.ఎస్. రమాకుమారి, నికిత, ఇందిర తదితరులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రతినబూనారు.

