పోరుమామిళ్ల: ఆగస్టు 25 ప్రజావాణి స్థానిక రెండవ సచివాలయం గ్రామపంచాయతీ పరిధిలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలను కులాల వారీగా సిద్ధం చేసినట్లు పోరుమామిళ్ల పంచాయతీ కార్యనిర్వాహక అధికారి (ఈఓ) యశ్వంత్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఓటర్లు తమ కులం వివరాలను పరిశీలించుకోవాలని, ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే తక్షణమే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.20 వార్డుల వారీగా జాబితాలు సిద్ధం, పంచాయతీ పరిధిలోని మొత్తం 20 వార్డులకు సంబంధించి ఓటర్ల కులాలను క్షుణ్ణంగా గుర్తించి, ఆ వివరాలను రికార్డులలో నమోదు చేసినట్లు ఈఓ వివరించారు. ఈ జాబితాలను సచివాలయంలో అందుబాటులో ఉంచామని, ఓటర్లు వీటిని సరిచూసుకోవచ్చని చెప్పారు. ఓటర్ల నుంచి వచ్చే అభ్యంతరాలను స్వీకరించి, వాటిని క్షేత్రస్థాయిలో (ఫీల్డ్ వెరిఫికేషన్) మరోసారి పరిశీలించి, అవసరమైన మార్పులు-చేర్పులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.ఓట్ల వివరాలు ఇవే..పోరుమామిళ్ల రెండవ సచివాలయం పరిధిలో మొత్తం 13,507 ఓట్లు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. వార్డుల వారీగా ఓట్ల విభజనను పరిశీలిస్తే:ప్రతి వార్డుకు సగటున 675 ఓట్లు కేటాయించారు. అయితే, 20వ వార్డులో మాత్రం స్వల్ప మార్పుతో 682 ఓట్లు ఉన్నట్లు ఈఓ వెల్లడించారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే పోలింగ్ బూత్లను కూడా ముందస్తుగా గుర్తించినట్లు ఆయన తెలిపారు.
ఈనెల 27 నుంచి 31 వరకు విచారణ
ఓటర్ల నుంచి అందే అభ్యంతరాలు, ఫిర్యాదులపై ఈనెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సమగ్ర విచారణ జరుపుతామని యశ్వంత్ కుమార్ పేర్కొన్నారు. ఆ విచారణ అనంతరం వచ్చిన నివేదికల ఆధారంగా తుది నిర్ణయం తీసుకుని, ఓటర్ల జాబితాను ఖరారు చేస్తామన్నారు. అర్హులైన ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ వివరాలను సరిచూసుకోవాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

