*ములుగు జిల్లా ప్రతినిధి శ్రీకాంత్(ప్రజావాణి)*
ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పస్రా–తాడ్వాయి మధ్య జాతీయ రహదారిపై ఇసుక లారీ కారును ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వేగంగా వస్తున్న ఇసుక లారీ ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది.
ఈ ఘటనలో వరంగల్ హన్మకొండలోని పెద్దమ్మగడ్డ ప్రాంతానికి చెందిన కలకోట సురేఖ మృతి చెందారు. ఆమె వయసు 45 సంవత్సరాలు. సురేఖ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో స్పెషల్ గ్రేడ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.
మరో మృతుడు కొత్తగూడెంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాద తీవ్రతకు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
గుర్తింపు కార్డుల ఆధారంగా మృతుల వివరాలను పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పస్రా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

