బెజ్జంకి, ఆగస్టు 20 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గూడెం గ్రామంలో గురువారం సాయంత్రం అడవి జంతువు దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. గ్రామానికి చెందిన అనుమండ్ల రామవ్వ సుమారు వయస్సు (45) వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఆమెపై అడవి జంతువు దాడి చేసినట్లు సమాచారం.ఈ దాడిలో ఆమె చేతులు, మెడ, కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. అయితే దాడి చేసింది నక్కనా, తోడేలా అన్న విషయంలో గ్రామస్థుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అదే సమయంలో అటుగా వెళ్తున్న కూలీలు ఘటనను గమనించి వెంటనే అంబులెన్స్కు సమాచారం అందించారు. దీంతో అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

