* జిల్లా ఇంచార్జి ఏపూరి వెంకటేశ్వర్ రావు మాదిగ
* ఎల్కతుర్తి ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ అడ్డూరి అనిల్ మాదిగ
ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-
మత దురహంకారం,కుల వివక్షత,సామాజిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణమే ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రధాన లక్ష్యమని ఎమ్మార్పీఎస్ హనుమకొండ జిల్లా ఇంచార్జి ఏపూరి వెంకటేశ్వర్ రావు మాదిగ అన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి గ్రామ స్థాయి నుంచి బలమైన ప్రజా పోరాటాలను నిర్మించడంతో పాటు మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆదివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఎల్కతుర్తి మండల ఇంచార్జి అడ్డూరి అనిల్ మాదిగ అధ్యక్షతన ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ మరియు అనుబంధ విభాగాల జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా ఇంచార్జి ఏపూరి వెంకటేశ్వర్ రావు మాదిగ, జిల్లా కో-ఇంచార్జి తడుగుల విజయ్ మాదిగ, ఎంఎస్పీ మాజీ జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ మాట్లాడుతూ,పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాలుగా సాగిన రాజీలేని ఉద్యమ ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని పేర్కొన్నారు. మాదిగలతో పాటు పేద, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఎమ్మార్పీఎస్ చేపట్టిన ఉద్యమాలు సామాజిక న్యాయ సాధనలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు.
దేశంలో ఇప్పటికీ కొనసాగుతున్న కుల వివక్ష కారణంగా అణగారిన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయని పేర్కొంటూ, ప్రజల్లో రాజకీయ చైతన్యం పెంపొందించి గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు నిర్మించాలని సూచించారు. అలాగే ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ విభాగాల కమిటీలను గ్రామ,మండల,జిల్లా స్థాయిలో పునర్వ్యవస్థీకరించి సంస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యార్థులు,యువతను ఉద్యమంలో భాగస్వామ్యం చేసి క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దాలని, మహనీయుల ఆశయాల సాధన,పీడిత వర్గాల విముక్తి,సామాజిక న్యాయం కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సూచించిన ఉద్యమ కార్యాచరణను విజయవంతం చేయాలని ప్రతి నాయకుడు,కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.గ్రామాలు, మండలాలు,జిల్లాల్లో నూతన కమిటీల నిర్మాణాన్ని వేగవంతం చేసి ఉద్యమాన్ని మరింత విస్తరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు బొంకూరి వంశీ మాదిగ,ఎల్తూరి సురేష్ మాదిగ,బొంకురి కార్తీక్ మాదిగ,మేకల రవీందర్ మాదిగ,అంబాల సంపత్ మాదిగ,మారుపాక రవీందర్ మాదిగ,అడ్డూరి నవీన్ మాదిగ,అడ్డూరి ప్రశాంత్ మాదిగ,గ్రామశాఖ అధ్యక్షులు అడ్డూరి శ్రీకాంత్ మాదిగ,గంగారపు రాజ్ మాదిగ, ఆరెపల్లి శ్రీనివాస్ మాదిగ,ఎర్రోళ్ల అనిల్ మాదిగ,రాజ్ కొమురయ్య మాదిగ,శనిగరపు వంశీ మాదిగతో పాటు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు, కార్యకర్తలు,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
సమావేశాన్ని విజయవంతం చేసిన అన్ని గ్రామాల ఎమ్మార్పీఎస్ శ్రేణులు, నాయకులు,కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు ఎమ్మార్పీఎస్ ఎల్కతుర్తి మండల ఇంచార్జి అడ్డూరి అనిల్ మాదిగ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




