పెద్ది సుదర్శన్రెడ్డికి తీవ్ర గుండెపోటు
9సార్లు సీపీఆర్ చేసి ప్రాణాలు నిలిపిన వైద్యులు

సీఎం రేవంత్ ఆదేశాలతో గ్రీన్ ఛానెల్ ద్వారా హైదరాబాద్ తరలింపు
వదంతులు నమ్మవద్దన్న డాక్టర్లు.. కోలుకుంటున్నట్లు వెల్లడి
చెన్నారావుపేట జూలై 26 ప్రజావాణి
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్రెడ్డి ఆదివారం ఉదయం హఠాత్తుగా తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు.ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికి తీవ్రమైన స్థితిలో ఉన్న సుదర్శన్రెడ్డికి కార్డియాలజిస్ట్ డాక్టర్ మమత రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి బృందం వెంటనే అత్యవసర చికిత్స అందించారు. దాదాపు 10 సార్లు సీపీఆర్ (CPR) చేయడంతో నిలిచిపోయిన గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది.మరోవైపు పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాలు, వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం జరగడంతో అభిమానులు, నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆందోళన చెంది సంతాప పోస్టులు పెట్టారు. దీంతో వెంటనే వైద్యులు స్పందించి.. పెద్ది సుదర్శన్రెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు, వదంతులను ఎవరూ నమ్మవద్దు అని మీడియా ద్వారా స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్రావు హుటాహుటిన రోహిణి ఆసుపత్రికి చేరుకున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు.కేటీఆర్, హరీష్రావు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి, హనుమకొండ నుంచి సికింద్రాబాద్ వరకు ఎలాంటి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ప్రత్యేక గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.భారీ పోలీసు బందోబస్తు మధ్య అంబులెన్స్లో సుదర్శన్రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి సురక్షితంగా తరలించారు.ప్రస్తుతం యశోద ఆస్పత్రిలోని నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందుతోంది. అవసరమైతే విదేశీ వైద్యుల సలహాలు కూడా తీసుకుంటున్నామని, ప్రస్తుతం పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నేతలు, వైద్యులు వెల్లడించారు.




