హమాలీలకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలి
ఆల్ హమాలి సంఘం జిల్లా కార్యదర్శి నాగన్న.
ప్రజావాణి, నెల్లికుదురు:ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆల్ హమాలి సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మేరకు ఆల్ హమాలీ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు తక్షణమే చేయాలన్నారు.మండలకేంద్రం నెల్లికుదురు లో ఆల్ హమాలి మండల కమిటీ సమావేశం రవి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. దీనికి నాగన్న హాజరై మాట్లాడుతూ హమాలి కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, ఈఎస్ఐ,పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, 50 సం.లు నిండిన హమాలి కి నెలకు రూ.6, వేల చొప్పున పెన్షన్ మంజూరు చేయాలని,ప్రతి హమాలీకి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ ప్రభుత్వం చేయించాలని పనిచేస్తున్న సందర్భంలో కార్మికుడు మరణిస్తే ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స గ్రేసియా ఇవ్వాలని, దహన సంస్కారాల ఖర్చులకు రూ.50 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికీ రెండున్నర సంవత్సరాలైనా హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను అసెంబ్లీలో చర్చించకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.ఇప్పటికే అనేకసార్లు హమాలీ కార్మికులు ధర్నాలు రాస్తూరోకులు, తాహసిల్దార్ కార్యాలయం,జిల్లా కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించినప్పటికీ హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో రాష్ట్రంలో కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సి ఐ టీ యు మండల కన్వీనర్ పెరుమాండ్ల బాబు గౌడ,కార్మికులు కారం రవి, ఇసంపల్లి ఐలేష్,సురేష్,నరేష్,ఉప్పలయ్య,సంపత్, వీరస్వామి,శేఖర్,హరీష్,ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
హమాలీలకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలి
RELATED ARTICLES




