వీరనారి చిట్యాల ఐలమ్మకు ఘన నివాళులు
తెలంగాణ మహిళా శక్తికి, బహుజన ధీరత్వానికి ఆమె ప్రతీక పీఏసీఎస్ డైరెక్టర్ మధు
మేడ్చల్ :- ఎల్లంపేట మున్సిపాలిటీ, డబిల్పూర్: తెలంగాణ సాయుధ పోరాటంలో అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతిని డబిల్పూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పీఏసీఎస్ డైరెక్టర్ మధు మాట్లాడుతూ.. అన్యాయం, దోపిడీ, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా వీరనారి ఐలమ్మ సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆమె చూపిన తెగువ, ధైర్యం, ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. తెలంగాణ మహిళా శక్తికి, బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని అన్నారు.
పీఏసీఎస్ డైరెక్టర్ మధు, రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా వెంకటేష్ యాదవ్తో పాటు బాల నరసింహ, ఎం. అశోక్, ఎం. మురళి, మల్లేష్, పి. రాములు, సదానంద్ తదితరులు పాల్గొని వీరనారి ఐలమ్మకు నివాళులు అర్పించారు.
వీరనారి చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం అని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు.

