లైసెన్సులు ఉన్నా లంచాల వేధింపులంటున్న కల్లు దుకాణదారులు మద్యం మత్తులో సిబ్బంది హంగామా చేసిన వీడియో కలకలం ఇవ్వకపోతే కేసులు పెడతాం’ అంటూ బెదిరింపుల ఆరోపణల ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని బాధితుల డిమాండ్
మేడ్చల్ పరిధిలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది వ్యవహారశైలిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చట్టబద్ధమైన లైసెన్సులు, అనుమతులు కలిగి వ్యాపారం నిర్వహిస్తున్న కల్లు దుకాణదారులను కొందరు సిబ్బంది అక్రమ వసూళ్ల పేరుతో వేధిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రతి నెలా కార్యాలయానికి మామూళ్లు చెల్లిస్తున్నప్పటికీ, మళ్లీ వివిధ కారణాలతో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వారు వాపోతున్నారు. డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తే తప్పుడు కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారంటూ పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలవారీ చెల్లింపులు ఒకవైపు, తరచూ వచ్చే అదనపు డిమాండ్లు మరోవైపు ఉండటంతో వ్యాపారం చేయడం కష్టంగా మారిందని వారు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా విచారణ జరిగి . వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉందిమద్యం మత్తులో హంగామా చేసినట్లు ఆరోపణలు సుమారు మూడు నెలల క్రితం జరిగినట్లు చెబుతున్న ఓ వీడియో ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఓ కల్లు దుకాణం వద్దకు వెళ్లిన ఎక్సైజ్ సిబ్బంది మద్యం మత్తులో ఉన్నట్లు కనిపిస్తూ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వీడియో ఆధారంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాము ఇప్పటికే ప్రతి నెలా కార్యాలయానికి మామూళ్లు చెల్లిస్తున్నామని, మళ్లీ ఎందుకు డబ్బులు ఇవ్వాలని దుకాణ యజమాని ప్రశ్నించడంతో అక్కడ వివాదం తలెత్తినట్లు సమాచారం. అనంతరం సిబ్బంది కార్యాలయంలోని మరో వ్యక్తికి ఫోన్ చేసి, అక్కడికి ఎవరు వచ్చి డబ్బులు తీసుకుంటున్నారనే విషయాన్ని ప్రస్తావించినట్లు బాధితులు చెబుతున్నారు.
ఫోన్లో మాట్లాడిన వ్యక్తి కూడా అక్కడికి వచ్చిన సిబ్బందికి ఎంతో కొంత ఇచ్చి పంపాలని, లేదంటే తాము చేయాల్సిన పని చేస్తామంటూ హెచ్చరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఎక్సైజ్ శాఖలో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న వసూళ్ల వ్యవహారంపై చర్చ మొదలైంది.
ఒకే దుకాణం.. పలువురి డిమాండ్లా?
వ్యాపారుల ఆరోపణలు నిజమైతే, ఒకే దుకాణదారుడి నుంచి వివిధ స్థాయిల్లో డబ్బులు వసూలు చేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నెలవారీగా చెల్లింపులు జరుగుతున్నప్పటికీ మళ్లీ మళ్లీ డబ్బులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారన్నది తేలాల్సి ఉంది. శాఖలోని సిబ్బంది మధ్య సమన్వయం లోపించిందా? లేక వసూళ్ల కోసం పోటీ జరుగుతోందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సామాన్యుడికో చట్టం.. అధికారులకో న్యాయమా?
మద్యం సేవించి వాహనాలు నడిపే సాధారణ ప్రజలపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్న సమయంలో, విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బందే మద్యం మత్తులో ఉన్నట్లు ఆరోపణలు రావడం విమర్శలకు దారితీస్తోంది. చట్టాలను అమలు చేయాల్సిన సిబ్బంది ప్రవర్తనపై ఆరోపణలు రావడం మరింత ఆందోళన కలిగించే అంశమని స్థానికులు అంటున్నారు.
సమగ్ర విచారణకు డిమాండ్
మేడ్చల్ పరిధిలో ఎక్సైజ్ సిబ్బందిపై వస్తున్న అక్రమ వసూళ్ల ఆరోపణలు, మద్యం మత్తులో విధులకు హాజరైనట్లు చెబుతున్న వీడియో ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని బాధితులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అదే సమయంలో ఆరోపణల్లో వాస్తవం లేదంటే అధికారికంగా వివరణ ఇచ్చి అనుమానాలకు తెరదించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

