గరుడసేవ భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన
నాలుగు మాడ వీధులు, ఔటర్ రింగ్ రోడ్డులో బందోబస్తు ఏర్పాట్ల తనిఖీ
భక్తుల భద్రతే ప్రథమ ధ్యేయం.. విధుల్లో పూర్తి అప్రమత్తతతో ఉండాలి: ఎస్పీ సుబ్బారాయుడు
తిరుమల, సెప్టెంబర్ 17 (ప్రజావాణి): తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడసేవను పురస్కరించుకుని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్, టీటీడీ సీవీ అండ్ ఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, ఐపీఎస్ ఆధ్వర్యంలో తిరుమలలో క్షేత్రస్థాయి ఇన్స్పెక్షన్ నిర్వహించారు. నాలుగు మాడ వీధులు, ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్–ఎగ్జిట్ మార్గాలు, క్యూలైన్లు, భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ ప్రాంతాల్లో పర్యటించి భద్రతా ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు.
రద్దీ నియంత్రణపై అధికారులకు ఆదేశాలు
గరుడసేవ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన మేరకు బందోబస్తు సిబ్బందిని మోహరించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. విధుల్లో ఉన్న సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు.


