జగిత్యాల స్టాప్ రిపోర్టర్, ఎండపల్లి, సెప్టెంబర్ 17 (ప్రజావాణి)
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు, ఆర్ఎంపి వైద్యుడు, డిడిఎన్ పురోహిత సంఘం సభ్యులు సింహాచలం జగన్ ఇటీవల అకాల మరణం చెందారు. ఆయన మృతితో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న డిడిఎన్ ఉమ్మడి వెల్గటూర్ మండల అధ్యక్షుడు పర్వతగిరి ప్రశాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో తోటి పురోహితులంతా గుల్లకోటలోని జగన్ నివాసానికి చేరుకున్నారు. మృతుని చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా డిడిఎన్ పురోహిత సంఘం తరఫున బాధిత కుటుంబానికి రూ. 22 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. మృతుని కుటుంబానికి సమాజంలో తామంతా అండగా ఉంటామని, ఎలాంటి కష్టం వచ్చినా అధైర్యపడకూడదని ప్రశాంత్ శాస్త్రి ధైర్యాన్ని చెప్పారు. జగన్ సమాజానికి, వైద్య విభాగానికి, సంఘానికి చేసిన సేవలను వారు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పురోహిత సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

