ఘట్కేసర్, ఆగస్టు 15: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘట్కేసర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లింగాల భూపాల్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాగించిన పోరాటాలు, చేసిన త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. వారి త్యాగాల కారణంగానే నేడు దేశ ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
దేశ సమైక్యత, సమగ్రతను కాపాడటంతో పాటు ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. యువత దేశ చరిత్ర, స్వాతంత్ర్య ఉద్యమం గురించి తెలుసుకుని దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జర్నలిస్టులు గోవింద్ రాజు గౌడ్, రామకృష్ణ చారి, కేతం రమేష్, శ్రీనివాసరెడ్డి, లంబ రాజు, పద్మారావు, యాదగిరి, నిరంజన్, సల్లూరి నర్సింగ్ రావు, సాయి కిరణ్, తాల్కా రాములు, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశభక్తి నినాదాలు చేస్తూ స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు అర్పించారు.


