•బీరంగూడ గుడిలో అమావాస్య వేళ ప్రత్యేక పూజలు
*అన్నాభిషేకం, మృత్యుంజయ హోమం.. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
అమీన్పూర్,ఆగస్టు 12 (ప్రజావాణి): బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించడంతో పాటు ఆలయ ప్రాంగణంలో మృత్యుంజయ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
అనంతరం భక్తుడు మణికంఠ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రహ్లాద్, వారి బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రతి అమావాస్య రోజున ఆలయ ప్రాంగణంలో మృత్యుంజయ హోమం, ప్రతి పౌర్ణమి రోజున మహా చండీ హోమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో దేవానాదం, చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొనదలచిన భక్తులు ముందురోజు ఆలయ అధికారులు, అర్చకులు లేదా దేవాలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని సూచించారు.
