📄 ePaper
Friday, July 31, 2026
📄 ePaper
HomeతెలంగాణPeddapalliభారీ వర్షాల దాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పర్యటన బాధితులకు తక్షణ సహాయం...

భారీ వర్షాల దాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పర్యటన బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశం

📰 Generate e-Paper Clip

 

వీర్లపల్లిలో ఆర్‌ఎఫ్‌సిఎల్ గోడ కూలి ఇండ్లలోకి చేరిన వరద నీరు… పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్

50వ డివిజన్‌లో కూలిన నిరుపేద ఇల్లు… బాధిత కుటుంబానికి ‘ఇందిరమ్మ ఇల్లు’ మంజూరు చేస్తామని హామీ

ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం… ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా

గోదావరిఖని జూలై 30 ప్రజావాణి :

గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. ముంపు ప్రాంతాల ప్రజలను పరామర్శిస్తూ, అధికారులను అప్రమత్తం చేశారు. వర్ష బాధితులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.

వీర్లపల్లిలో వరద ముంపు పరిశీలన

భారీ వర్షాల ధాటికి ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్ (RFCL) నిరోధక గోడ కూలిపోవడంతో వరద నీరు వీర్లపల్లి గ్రామంలోని పలు నివాసాల్లోకి చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమాచారం అందుకున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్… పెద్దపల్లి జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్‌లతో కలిసి గురువారం వీర్లపల్లిలో పర్యటించారు. వరద ముంపు ప్రాంతాలను సందర్శించి, బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

బాధితులకు అవసరమైన సహాయ చర్యలు వెంటనే చేపట్టాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

50వ డివిజన్‌లో దెబ్బతిన్న నిరుపేద ఇల్లు – ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు ఆదేశం

స్థానిక 50వ డివిజన్ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్ వెనుక నివాసముంటున్న నిరుపేద మహిళ శ్రీమతి రేష్మ ఇల్లు వర్షాలకు తీవ్రంగా దెబ్బతిని గోడలు కూలిపోయాయి. ఈ విషయాన్ని స్థానిక కార్పొరేటర్ ధూళికట్ట సతీష్ తక్షణమే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లగా,  వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే… ప్రభుత్వం తరఫున తక్షణ అత్యవసర సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వో రవీందర్ రావును ఆదేశించారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి శాశ్వత నివాసంగా ‘ఇందిరమ్మ ఇల్లు’ మంజూరయ్యేలా అవసరమైన పనులు చేపట్టాలని స్థానిక కార్పొరేటర్‌కు సూచించారు.

ఈ పర్యటనలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య యాదవ్, 50వ డివిజన్ కార్పొరేటర్ ధూళికట్ట సతీష్, ఏసీపీ మడత రమేష్, సీఐ ఇంద్రసేన రెడ్డి, ఎమ్మార్వో రవీందర్ రావు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular