ఘట్కేసర్, ఆగస్టు 5: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్–9 వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అక్రమ ఎల్పీజీ గ్యాస్ దందాను పోలీసులు వెలికితీశారు. ఎస్వోటీ బృందం అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పదంగా గ్యాస్ సిలిండర్లను ఆటో ట్రాలీలోకి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో పూసా రామ్ (43) అనే గ్యాస్ సరఫరాదారు, అతని సహాయకుడు ఓం ప్రకాశ్ (32) సబ్సిడీపై లభించే గృహోపయోగ ఎల్పీజీ సిలిండర్లను లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి, టీ స్టాళ్లు, హోటళ్లు తదితర వాణిజ్య సంస్థలకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. అలాగే గృహోపయోగ సిలిండర్లలోని గ్యాస్ను వాణిజ్య సిలిండర్లలోకి అక్రమంగా బదిలీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుల వద్ద నుంచి 5 గృహోపయోగ ఎల్పీజీ సిలిండర్లు, 3 వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు, 36 చిన్న ఎల్పీజీ సిలిండర్లు, ఒక సుజుకి ఆటో ట్రాలీను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సబ్సిడీ గృహోపయోగ ఎల్పీజీ సిలిండర్లను అక్రమంగా కొనుగోలు చేయడం, విక్రయించడం లేదా వాణిజ్య అవసరాలకు వినియోగించడం చట్టవిరుద్ధమని, ప్రజల భద్రతకు ముప్పు కలిగించే ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఘట్కేసర్ పోలీసులు హెచ్చరించారు.





