*!*
చాక్పీస్ పట్టిన చేతులే.. నిరసన బ్యాడ్జీలు తొడుగుతున్నాయి!
జీతాలు రాక.. మెడికల్ బిల్లులు అందక.. గురువుల గుండె మంట.
మనకోసం మనమే కొట్లాడకపోతే ఎలా? – టీపిటీఎఫ్ నేత సురేందర్ కన్నీటి ప్రశ్న.
నేటి నుంచే యూఎస్పీసీ మహా పోరాటం.. సెప్టెంబర్లో అసెంబ్లీ ముట్టడి.
కేసముద్రం ఆగష్టు 06,ప్రజావాణి.
క్లాసు రూములో అడుగుపెడితే ఆ ముఖాల్లో అలసట కనిపించదు. ఇంట్లో ఎన్ని కష్టాలున్నా.. పిల్లల భవిష్యత్తు కోసం చిరునవ్వుతో అక్షరాలు దిద్దిస్తారు. సమాజానికి ఐఏఎస్, ఐపీఎస్, రాజకీయ నాయకులను అందించేది ఆ గురువులే. కానీ, ఈరోజు అదే గురువుల ఇళ్లల్లో దీపాలు వెలగడం లేదు. రావాల్సిన జీపీఎఫ్ బకాయిలు అందక, అనారోగ్యంతో హాస్పిటల్లో చేరితే మెడికల్ రీయింబర్స్మెంట్ రాక, కరువు భత్యాలు (డీఏ) నిలిచిపోయి.. ఉపాధ్యాయులు లోలోపల నలిగిపోతున్నారు. ఈ ఆవేదనే ఇప్పుడు ఒక మహా ఉద్యమంగా మారి ‘నల్ల బ్యాడ్జీల’ రూపంలో రోడ్డెక్కుతోంది.ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి పిలుపు మేరకు నేటి (ఆగస్టు 7) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్నారు.
*మనకోసం మనమే కొట్లాడకపోతే ఉన్న హక్కులూ పోతాయి!*
కేసముద్రం విలేజ్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన సమావేశంలో టీపిటీఎఫ్ మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడిన మాటలు కేవలం ఒక ప్రకటన కాదు.. అది వేలాది మంది ఉపాధ్యాయుల గుండె నిండా దాచుకున్న బాధ. భావితరాలకు హక్కుల గురించి చెప్పే మనం.. మన హక్కులను కోల్పోతుంటే చూస్తూ ఊరుకుందామా? మనకోసం మనమే కొట్లాడలేకపోతే.. రేపు మన పిల్లల భవిష్యత్తు ఏంటి? అంటూ ఆయన ప్రశ్నించిన తీరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తెప్పించింది.తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం హద్దులు దాటిందని, అందుకే ప్రతి ఉపాధ్యాయుడు ఒక సైనికుడిలా మారి పీఆర్సీ సాధించే వరకు విశ్రమించకూడదని పిలుపునిచ్చారు.
*గురువుల ఇళ్లల్లో తీరని కష్టాలు..*
ఒకప్పుడు ఉపాధ్యాయుడి ఉద్యోగం అంటే సమాజంలో ఒక గౌరవం. కానీ నేడు నెలనెలా జీతాలు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. పీఆర్సీ ఊసే లేదు. ఒక ఉపాధ్యాయుడికి ప్రాణాంతక జబ్బు వస్తే.. మెడికల్ బిల్లుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రిటైర్ అయిన వారికి రావాల్సిన డబ్బులు సకాలంలో అందడం లేదు. తమ సొంత డబ్బులైన జీపీఎఫ్ నిధులను కూడా వాడుకోలేని దుస్థితిలో ఉపాధ్యాయ లోకం ఉందంటే విద్యావ్యవస్థ ఎంత సంక్షోభంలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
*సెప్టెంబర్ వరకు ‘పోరు బాట’.. షెడ్యూల్ ఇదే.*
ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా యూఎస్పీసీ ఐక్య కార్యాచరణను ప్రకటించింది.
ఆగస్టు 7: క్లాస్ రూముల్లో నల్ల బ్యాడ్జీలతో నిశ్శబ్ద విప్లవం.
ఆగస్టు 12, 13: మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు.
ఆగస్టు 19: జిల్లా కేంద్రాల్లో గర్జించనున్న ఉపాధ్యాయులు (ధర్నాలు).
ఆగస్టు 21-26: రాష్ట్ర, జిల్లా బృందాల పర్యటనలు, ప్రెస్ మీట్లు.
ఆగస్టు 29: హైదరాబాద్ ఇందిరా పార్క్లో ‘మహా ధర్నా’.
సెప్టెంబర్: అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే అసెంబ్లీ ముట్టడి (చలో అసెంబ్లీ).ఈ నిరసనల సన్నాహక సమావేశంలో ప్రధాన కార్యదర్శి నర్సింహ రాజు, కార్యదర్శులు వీసం నర్సయ్య, ఊటుకూరు ప్రణయ్ కుమార్, అప్పాల నాగరాజు, మోహన కృష్ణ తదితరులు పాల్గొని తమ గళాన్ని వినిపించారు.
అక్షర శిల్పుల ఆక్రందన.. ‘నల్ల’ రంగు పులుముకుంటున్న బడి
RELATED ARTICLES




