కడప జిల్లా, పోరుమామిళ్ల: సెప్టెంబర్ 20 ప్రజావాణి పోరుమామిళ్ల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని టేకురుపేట సమీప అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో రెండు ట్రాక్టర్లలో తరలిస్తున్న టేకు మొద్దులను అటవీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. పట్టుకున్న వాహనాలను టేకు మొద్దులతో సహా పోరుమామిళ్ల ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు.ఒక్కో ట్రాక్టర్లో సుమారు 30 టేకు మొద్దులు చొప్పున మొత్తం 60 మొద్దులు ఉన్నట్లు ఉన్నాయి.భారీ మొత్తంలో టేకు కలప పట్టుబడిన నేపథ్యంలో అసలు ఈ మొద్దులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి ఆధ్వర్యంలో తరలిస్తున్నారు? వాటికి అవసరమైన అనుమతులు, ట్రాన్స్పోర్ట్ పర్మిట్లు ఉన్నాయా? అనే ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
ఉదయం మొదలైన తరలింపు.. అసలు ఏం జరిగింది?
ఆదివారం ఉదయం సుమారు 10.45 గంటల సమయంలో పట్టుబడిన రెండు ట్రాక్టర్లలో ఒకదాన్ని అధికారులు బయటకు పంపించినట్లు పంపించారు. ఏ విధమైన అనుమతులతో పంపించారనేది తెలియాల్సి ఉంది. మరో ట్రాక్టర్లో ఉన్న టేకు మొద్దులను రాత్రి అన్లోడ్ చేసి మరల ఉదయం జేసీబీ సహాయంతో తిరిగి లోడ్ చేయించి ఫారెస్ట్ అధికారుల సమక్షంలో పంపించారు.ఈ మొత్తం ప్రక్రియ అటవీ అధికారుల సమక్షంలోనే జరిగిందనేది వాస్తవం.
రూ.లక్షల విలువైన కలపకు రూ.10 వేల జరిమానానేనా?
ఇక్కడే అసలు ప్రశ్నలు మొదలవుతున్నాయి. రెండు ట్రాక్టర్లలో కలిపి సుమారు 60 టేకు మొద్దులు పట్టుబడగా, వాటిపై కేవలం రూ.10 వేల జరిమానాతోనే వాహనాలను పంపించారనే సమాచారం తీవ్ర చర్చకు దారితీస్తోంది.కలప విలువ ఎంత? మొద్దుల పరిమాణం, బరువు ఎంత? వాటి మూలం ఏమిటి? రవాణాకు చెల్లుబాటు అయ్యే ట్రాన్సిట్ పర్మిట్లు ఉన్నాయా? నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? అనే అంశాలపై ఫారెస్ట్ అధికారులు సమాచారం ఇవ్వాల్సి ఉంది. మీడియా పరంగా ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేయగా ఈ ఫారెస్ట్ అధికారులు ఎవ్వరు స్పందించలేదు.
ఎందుకు స్పందించలేదు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఫారెస్ట్ రేంజ్ అధికారి కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా దాటవేస్తున్నారు.దీనిపై సామాన్యులకు ఒక న్యాయం, అధికారులకు ఒక న్యాయమా అని ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతుంది.ఫారెస్ట్ అధికారులపై పై అధికారులు ఈ విషయంపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్.

