కొండాపూర్ లో ఎల్డీసీ సహకారంతో రైతులకు లింగాకర్షణ బుట్టల పంపిణీ
మద్దూరు సెప్టెంబర్ 15, ప్రజా వాణి,
మండలంలోని కోండాపూర్ రైతు వేదికలో మారి సంస్థ ఆధ్వర్యంలో,ఎల్డీసీ సంస్థ సహకారంతో రైతులకు లింగాకర్షణ బుట్టలను పంపిణీ చేశారు.పత్తి పంటను ఆశించే గులాబీ రంగు పురుగు (పింక్ బోల్వరం) నివారణ, నియంత్రణపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు,ఈ కార్యక్రమంలో భాగంగా 150 మంది రైతులకు ఒక్కొక్కరికి 10 చొప్పున మొత్తం 1,500 లింగాకర్షణ బుట్టలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎల్డీసీ సంస్థ ప్రతినిధి శ్రీ కార్తిక్ మాట్లాడుతూ, పత్తి పంటను ఆశించే గులాబీ రంగు పురుగు ఉధృతిని ప్రారంభ దశలోనే గుర్తించేందుకు లింగాకర్షణ బుట్టలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.రైతులు వీటిని పత్తి పొలాల్లో సూచించిన విధంగా సరైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుని, పురుగు ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. పురుగు ఉధృతిని సకాలంలో గుర్తించి, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సమగ్ర నివారణ చర్యలు చేపట్టడం ద్వారా పంట నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మారి–బి సి ఐ ప్రొడ్యూసర్ యూనిట్ మేనేజర్ చాగంటి నరేష్, మారి–బి సి ఐ పి ఏం గాండ్ల రాజు,మారీ–బి సి ఐ సిబ్బంది, ఎల్ డీ సి సభ్యులు కార్తిక్, గ్రామ సర్పంచ్ సుప్రియ,ఉప సర్పంచ్ కవిత, గ్రామ పంచాయతీ కార్యదర్శి వేణు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతులు లింగాకర్షణ బుట్టలను సద్వినియోగం చేసుకుని గులాబీ రంగు పురుగు నియంత్రణలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు సూచించారు.

