ఘట్కేసర్, ఆగస్టు 25 (ప్రజావాణి): పేరులోనే ‘తాజా’.. కానీ ఆహార నాణ్యత మాత్రం అధ్వానంగా ఉందంటూ జోడిమెట్లలోని తాజా టిఫిన్స్పై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ హోటల్లో కొనుగోలు చేసిన పొంగలిలో పురుగులు కనిపించాయని ఓ వినియోగదారు ఆరోపించారు. ఆహార పదార్థాల తయారీలో కనీస పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
పొంగలిలో పురుగులు కనిపించడంపై హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా, సమస్యపై సరైన వివరణ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చారని వినియోగదారులు ఆరోపించారు. సమస్యను పరిష్కరించాల్సిన యాజమాన్యం వ్యవహరించిన తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
“పేరుకే ‘తాజా’.. ఆహారంలో మాత్రం పురుగులా?” అంటూ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.
జాతీయ రహదారి వెంట ఉన్న హోటళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వినియోగదారులు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే విధంగా వ్యవహరిస్తున్న సంస్థలపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై సంబంధిత ఆహార భద్రత అధికారులు తక్షణమే తనిఖీలు నిర్వహించి, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించాలని బాధితులు కోరుతున్నారు. ఆరోపణలు నిజమని నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


