ఆగస్టు 24 నుంచి నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి.
.ప్రజలు తమ అర్జీలను నూతన ఐడీఓసీ కార్యాలయంలో అందజేయాలి.
జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు.
*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)*:-
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఆగస్టు 24వ తేదీ నుంచి నూతనంగా ప్రారంభించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ), ములుగులో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆగస్టు 24వ తేదీ సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం గ్రౌండ్ ఫ్లోర్లో ఎడమ వైపున ఉన్న సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.ప్రజలకు వివిధ ప్రభుత్వ శాఖల సేవలను ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ములుగు గట్టమ్మ సమీపంలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన అత్యాధునిక సౌకర్యాలతో నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. వివిధ జిల్లా స్థాయి శాఖల కార్యాలయాలను ఒకేచోట ఏర్పాటు చేయడంతో ప్రజలు తమ పనుల కోసం వేర్వేరు ప్రాంతాల్లోని కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సులభంగా ప్రభుత్వ సేవలు పొందే అవకాశం కలిగిందన్నారు.
విశాలమైన కార్యాలయ గదులు, సమావేశ మందిరాలు, ప్రజలకు అనుకూలమైన వసతులతో నూతన కలెక్టరేట్ను జిల్లా పరిపాలనకు కేంద్రబిందువుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
ప్రజలు తమ సమస్యలు, వినతులు, దరఖాస్తులను సమర్పించేందుకు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే సమయంలో ఈ మార్పును గమనించాలని సూచించారు. ఆగస్టు 24వ తేదీ సోమవారం నుంచి నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు తమ దరఖాస్తులను అందజేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.

