ఘట్కేసర్, ఆగస్టు 10 (ప్రజావాణి): ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని బీజేపీ ఘట్కేసర్ మండల అధ్యక్షుడు బస్వరాజు గౌడ్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు, రాష్ట్ర, జిల్లా పార్టీ సూచనలతో నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఘట్కేసర్ మండల బీజేపీ ఆధ్వర్యంలో ఎదులాబాద్ బీసీ కాలనీలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బస్వరాజు గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. అనంతరం దేశభక్తి నినాదాలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేసి ప్రజల్లో దేశభక్తి భావనను మరింత బలోపేతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కాలేరు రామోజీ, ఎదగని శ్రీరాములు, గుండ్ల బాలరాజు, దళిత మోర్చా రాష్ట్ర సమన్వయకర్త కరుణాకర్, జిల్లా మీడియా కన్వీనర్ చలువాది ప్రవీణ్ రావు, బీజేఎం కార్యదర్శి కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు పోలు భాస్కర్ గౌడ్, గోబిరి మన్యం, ఉపాధ్యక్షులు పాముకుంట్ల బాలరాజ్ గౌడ్, కృష్ణ యాదవ్, కార్యదర్శి చింతకింది సుధాకర్, మాజీ సర్పంచ్ బట్టే శంకర్, జిల్లా రజక సహ-సమన్వయకర్త బండిరాల సాయిరాం, కొర్రెమల శక్తి కేంద్రం ఇన్చార్జ్ బైనగారి సత్యనారాయణతో పాటు బూత్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


