ఘట్కేసర్, జూలై 5: ఘట్కేసర్ మండల పరిధిలోని కేల్ మహేంద్ర కాలనీలో ఆదివారం శ్రీ రేణుక ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ దేవి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు నిత్యార్చన, నూతన విగ్రహ ప్రతిష్ఠాపన, ఆశీర్వచన కార్యక్రమాలు వేద మంత్రోచ్చారణల నడుమ వైభవంగా జరిగాయి.
అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కాలనీ ప్రజలు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్ల ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు ఎన్. రాములు, చైర్మన్ ఎం. శ్యాం కుమార్, ప్రధాన కార్యదర్శి జే. యాదగిరి, కోశాధికారి పి. ఎల్లయ్య, వైస్ చైర్మన్ జి. రవి, సంయుక్త కార్యదర్శి ఎం. మైసయ్యతో పాటు సీహెచ్. కృష్ణయ్య, శ్రీనివాస చౌదరి, బి. రాజు, ఎస్. రాజు, జి. బద్రి, మైసా మధుసూదన్, అజయ్ రామచందర్ నాయక్, మారుతి తదితరులు పాల్గొన్నారు. భక్తజనులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.





