- హుజూర్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయం…పిల్లుట్ల రఘు
నేరేడుచర్ల, సెప్టెంబర్ 15 (ప్రజావాణి):
రాబోయే రోజుల్లో హుజూర్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించబోతుందని బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ నాయకుడు పిల్లుట్ల రఘు అన్నారు. మంగళవారం నేరేడుచర్ల మండలం మూసి ఒడ్డు తండాలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం మండలంలోని పులగంబండ తండా, చిల్లేపల్లి, చింతకుంట్ల, బూరుగుల తండా, ముకుందాపురం, దాసారం, పెంచికల్దిన్నె గ్రామాలతో పాటు నేరేడుచర్ల పట్టణంలోని వివిధ వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల ప్రజలపై వినాయకుడి కృపాకటాక్షాలు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా,మంత్రిగా పనిచేసిన మంత్రి నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.రామగిరి నుంచి మూసి ఒడ్డు సింగారం వరకు ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
అలాగే జాబ్ మేళాల పేరుతో యువతకు హామీలు ఇస్తూ కాలయాపన చేయడం కాకుండా హుజూర్నగర్ నియోజకవర్గంలోని సిమెంట్ పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ విషయంపై మంత్రి సమాధానం చెప్పాలని రఘు అన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు కోనతం లచ్చిరెడ్డి, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు లావుడ్యా శ్రీను నాయక్,మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పంగ శ్రీను, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు,న్యాయవాది నగేష్ రాథోడ్,శివారెడ్డి, గుమ్మడివెళ్లి వెంకన్న,దాసారం సర్పంచ్ వీరారెడ్డి,పెంచికల్దిన్నె సర్పంచ్ సోములు,యువ నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

