
* సమాచార హక్కు చట్టంతో అధికారుల నిద్ర మత్తు వదలగొడుతున్న స్థానిక పౌరుడు
* ఏడు నెలల కాలానికి 10,000 పేజీల రికార్డు పరిశీలనలకు దరఖాస్తు చేసుకున్న బృందం
భిక్కనూరు, సెప్టెంబర్ 10 ( ప్రజావాణి)
పారదర్శకతకు ప్రతీకగా చెప్పుకునే ప్రభుత్వ యంత్రాంగం, భిక్కనూరు మండలంలో మాత్రం అక్రమాలకు నిలయంగా మారుతోందా? అధికార దుర్వినియోగం, నిధుల దుర్వినియోగంపై స్థానిక అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే పరిణామం చోటుచేసుకుంది. భిక్కనూరు మండలానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త బొందుగుల భాస్కర్ ఒక నిర్దిష్ట కాలంలో జరిగిన ప్రభుత్వ/పంచాయతీ కార్యకలాపాలపై సమాచార హక్కు చట్టం, 2005 కింద దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అట్టి దరఖాస్తుకు ప్రతిగా పంచాయతీ అధికారి దాదాపు 21వేల రూపాయలు జిరాక్స్లకు గాను కట్టమని ప్రత్యుత్తరం పంపించడం జరిగింది.
దాదాపు 7 నెలల కాలానికి పదివేల పేజీలు ఎలా ఉంటాయి అని మొదటి ఆపిలేట్ అధికారికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మొదటి అప్పిలేట్ అధికారి కూడా అదే సమాధానాన్ని పంపడంతో దరఖాస్తుదారుడు అట్టి 10,600 పేజీలను సమాచార హక్కు చట్టంలో భాగంగా పరిశీలన చేయడానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది.
ఈ దరఖాస్తులో భిక్కనూరు మండల ప్రజా సమాచార అధికారి అందించడం జరిగింది . దరఖాస్తుదారుడు 01.01.2026 నుండి 29.07.2026 వరకు కాలానికి సంబంధించిన ప్రతి పత్రాన్ని పరిశీలించడానికి అవకాశం కోరారు. కేవలం ఫైళ్లు చూపడమే కాదు, వాటిని పరిశీలించిన తర్వాత అవసరమైన పేజీలను ధృవీకరించిన కాపీలుగా కోరడం ఈ కేసులోని అసలు మలుపు.
ఈ మొత్తం వ్యవహారం వెనుక నిధుల దుర్వినియోగం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ ఉద్దేశపూర్వకంగానే పెద్ద మొత్తంలో డబ్బులు అడుగుతూ నాకు సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు అని వాపోయారు. ఒక సామాన్యుడు భారత రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజల కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ప్రజలు తెలుసుకునే హక్కు ఉందని వాపోయారు.
* దరఖాస్తులోని ప్రధాన డిమాండ్లు:
నిధుల దుర్వినియోగంపై అనుమానం…
01.01.2026 నుండి 29.07.2026 వరకు జరిగిన అన్ని పనులకు సంబంధించిన బిల్లులు, వౌచర్లు, చెల్లింపు ఉత్తర్వులను పరిశీలించడానికి అవకాశం కోరారు. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా ప్రజల కోసం ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని అట్టినిధులు దుర్వినియోగం కాకుండా ప్రజల కోసమే ఖర్చు పెట్టినప్పుడు చూపించడానికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు.
* అధికారుల కుమ్మక్కు బట్టబయలు..
దాదాపు ఒక 15 చెక్కులకు పదివేల పేజీలు రాశారు అంటే నమ్మశక్యంగా లేదని అందుకే మండల అధికారిని సంప్రదించాలని వారు కూడా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోవడంతో ఒకే రకమైన సమాధానం ఇవ్వడంతో రికార్డు పరిశీలనకు దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. ఏవైతే 10000 పేజీలు ఉన్నాయో సమాచార హక్కు చట్టం కింద పరిశీలన చేసి నాకు కావాల్సిన ముఖ్యమైన పేజీలను చట్టం ప్రకారం డబ్బులు కట్టి తీసుకుంటానని తెలిపారు.
* సమావేశాల మినిట్స్….
పంచాయతీ తీర్మానాలు, సమావేశ మినిట్స్, మరియు హాజరు వివరాలను పరిశీలించడం ద్వారా, అనధికారికంగా లేదా తప్పుడు పద్ధతిలో నిర్ణయాలు తీసుకున్నారా అనేది నిర్ధారితమవుతుంది అని ఏడు నెలల కాలంలో పదివేల పేజీలు ఏ గ్రామ పంచాయతీలో కూడా రాయడం సాధ్యం కాదని ఉద్దేశపూర్వకంగా నాకు సమాచారం అందించకుండా ఉండడానికి ఇది చేసిన ప్రయత్నం లాగా భావిస్తానని నా బృందం చే రికార్డు పరిశీలనలు చేసిన తర్వాత ప్రజలకు అన్ని వివరాలు అందజేస్తానని తెలిపారు.
ఒకవేళ ప్రజా సమాచార అధికారి ఈ సమాచారం/రికార్డులను అందించడంలో విఫలమైతే, సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 7(6) ప్రకారం నిర్ణీత కాలపరిమితిలో సమాచారం ఇవ్వని పక్షంలో, ఆ సమాచారం ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా సంబంధిత అధికారిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది అని సమాచార హక్కు చట్టంలో ఉంది అని తెలిపారు.
ఈ దరఖాస్తుతో భిక్కనూరు గ్రామంలో ప్రతి అధికారి, ప్రతి ప్రజాప్రతినిధి ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సామాజిక కార్యకర్త పోరాటం విజయవంతమైతే, భిక్కనూరు మండల చరిత్రలో అతిపెద్ద సంచలనంగా మారే అవకాశం ఉంది. ఇది ప్రజలందరూ గమనించాల్సిన పరిణామం.

