బీజేఆర్ నగర్లో గౌడ సంఘం అన్నదాన సందడి.
జవహర్నగర్, సెప్టెంబర్ 16 ( ప్రజావాణి ప్రతినిధి)
జవహర్నగర్ డివిజన్ పరిధిలోని బీజేఆర్ నగర్లో గౌడ సంఘం నూతన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. గౌడ కులస్తులు, సంఘం సభ్యులు కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాలనీవాసులు, స్థానికులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, సంఘం పెద్దలు, ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వచ్చిన వారికి అన్నదానం చేశారు. దీంతో బీజేఆర్ నగర్లో సందడి నెలకొంది.
కార్యక్రమానికి జవహర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు, పెద్దలు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. నూతన కమిటీ ఏర్పాటైన తర్వాత చేపట్టిన అన్నదాన కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. కమిటీ సభ్యులు, సంఘం నాయకులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. బీజేఆర్ నగర్ పరిధిలో గౌడ కులస్తులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, భవిష్యత్తులో సొసైటీ ఏర్పాటు చేసుకునే ఆలోచన కూడా ఉందని తెలిపారు. గౌడ కులస్తుల సంక్షేమం, ఐక్యత కోసం అందరి సహకారంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
