పిల్లల ఎదుగుదల కోసం ఇచ్చే బాలామృతం పురుగుల నివారణకు వినియోగం
గోవిందరావుపేట ఘటన మరువకముందే దుంపిల్లగూడెంలో మరో సంఘటన
విష గుళికలు కలిపిన బాలామృతం తిని గేదె మృతి. కలకలం
ప్రజావాణి/గోవిందరావుపేట:అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల ఎదుగుదల కోసం అందించే బాలామృతాన్ని పురుగుల నివారణకు ఉపయోగించడం తీవ్ర కలకలం రేపుతోంది. మండలం లోనీ దుంపిల్లగూడెం గ్రామంలో బాలామృతంలో విష గుళికలు కలిపి పామాయిల్ తోటలో విషపు ఎరగా ఉంచగా.. దానిని తిన్న గేదె మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.
గ్రామానికి చెందిన ఎర్రబోయిన కొమురయ్య కు చెందిన పాడి గేదె (సుమారు లక్ష రూపాయల విలువ గలది) రోజువారీగా మేత కోసం గ్రామ సమీపంలోని పామాయిల్ తోట వైపు వెళ్లింది. అక్కడ చెట్ల మొదళ్ల వద్ద ఉంచిన బాలామృతంలో కలిపిన విష గుళికల ఎర ను గేదె తినడంతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు సమాచారం.
పామాయిల్ చెట్లకు వేరు పురుగు సోకడంతో నివారణ చర్యల్లో భాగంగా ఓ రైతు అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పంపిణీ చేసే బాలామృతాన్ని సేకరించి, అందులో విష గుళికలు కలిపి చెట్ల మొదళ్ల వద్ద ఉంచినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల గోవిందరావుపేటలో బాలామృతం విషయంలో చోటుచేసుకున్న ఘటనను ప్రజలు మరువకముందే తాజాగా దుంపిల్లగూడెంలో అదే తరహాలో విష గుళికలు కలిసిన బాలామృతం కారణంగా పాడి గేదె మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లల ఆరోగ్యం, పశువుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా బాలామృతాన్ని ఇలా వినియోగించడంపై అధికారులు తక్షణమే స్పందించి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
గేదె మృతికి కారణమైన రైతుపై చర్యలు చేపట్టాలి.
ఎర్ర బయిన కొమురయ్య
పామాయిల్ తోట చుట్టూ కంచె ఏర్పాటు చేసుకోకుండా బాలామృతం లో విషపు గుళికలు కలిపి ఉంచడం వల్ల గేదె తిని మృతి చెందడం జరిగింది. అంతేకాక సదరు రైతు మాగాణి భూమి సర్వే నెంబర్ను అధికారులకు ఇచ్చి ఫామ్ ఆయిల్ మొక్కలు తెచ్చుకొని మరో భూమిలో మొక్కలు నాటి అటు ఉద్యానవన శాఖ అధికారులను ఇటు ఉపాధి హామీ పథకం అధికారులను మోసం చేశారు. దీనిపై విచారణ జరిపి నాకు జరిగిన అన్యాయం మరొకరి జరగకుండా నివారించాలి. ఈ విషయమై ఇప్పటికే స్థానిక పసర పోలీస్స్టేషన్లో మరియు ప్రజావాణిలో కూడా నాకు జరిగిన అన్యాయాన్ని వివరించాను. అసలు బాలామృతం ఆ రైతుకు ఎలా వచ్చింది అన్నదానిపై సమగ్ర విచారణ జరపాలి. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలి.

