పోరుమామిళ్లలో పోస్టల్ శాఖ నిర్లక్ష్యం..రోడ్డుపై పడి ఉన్న ఉత్తరాల పెట్టె, ప్రజల ఆగ్రహం
పోరుమామిళ్ల:సెప్టెంబర్ 15 ప్రజావాణి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అత్యంత నమ్మకమైన, పురాతన సేవలలో ఒకటైన ఇండియన్ పోస్టల్ శాఖ నిర్లక్ష్యం పోరుమామిళ్లలో బట్టబయలైంది.కడప జిల్లా పోరుమామిళ్ల మండల కేంద్రంలోని సబ్ పోస్టాఫీస్ (పిన్ కోడ్: 516193) ఆవరణలో ఉండాల్సిన లెటర్ బాక్స్ (ఉత్తరాల పెట్టె) ప్రస్తుతం అత్యంత దయనీయ, అస్తవ్యస్త స్థితిలో రోడ్డుపై పడి ఉండటం స్థానిక ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. డిజిటల్ యుగంలో కూడా కోర్టు నోటీసులు,ప్రభుత్వ ఉత్తరాలు,ఉద్యోగ దరఖాస్తులు,రిజిస్టర్ పోస్టులు, సాధారణ ప్రజల వ్యక్తిగత లేఖలకు పోస్టల్ శాఖే ప్రధాన ఆధారం.అలాంటి నమ్మకమైన వ్యవస్థలో భద్రత లేకపోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
రోడ్డు పక్కన,బైకుల మధ్యన పడి ఉన్న పెట్టె
సబ్ పోస్టాఫీస్ ముందు గోడకు బిగించి ఉండాల్సిన లెటర్ బాక్స్, ప్రస్తుతం వాహనాల పార్కింగ్ మధ్యలో, రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా పడి ఉంది. దానికి ఉండాల్సిన స్టాండ్ లేదు, తాళం వేసే భాగం పూర్తిగా విరిగిపోయి ఉంది. ఎవరైనా చేతితో తీసి ఉత్తరాలు బయటకు తీయగలిగే పరిస్థితి నెలకొంది. వర్షం పడితే ఉత్తరాలన్నీ తడిసి ముద్దయ్యే పరిస్థితి ఉంది.పోస్టల్ చట్టం ప్రకారం ప్రతి ఉత్తరం గోప్యత, భద్రత పోస్టల్ శాఖ బాధ్యత. కానీ ఇక్కడ తాళం లేని, రక్షణ లేని పెట్టెలో ఉత్తరం వేస్తే అది గమ్యస్థానం చేరుతుందన్న నమ్మకం లేకుండా పోయింది.వ్యక్తిగత లేఖలు,బ్యాంకు పత్రాలు,ఆధార్ కార్డులు,పాస్బుక్ లు వంటివి దొంగిలించబడే ప్రమాదం ఉంది. దుండగులు సులభంగా ఉత్తరాలను చించేసే, తగలబెట్టే అవకాశం కూడా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా బద్వేలు డివిజనల్ పోస్టల్ అధికారులు,కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఇంత నిర్లక్ష్యమా?పోస్ట్ ఆఫీస్ లెటర్ బాక్స్కు కనీసం తాళం కూడా లేదు! ఉత్తరాల భద్రత గాలికొదిలేసిన అధికారులు
1. వెంటనే పాడైపోయిన లెటర్ బాక్స్ ను తొలగించి,కొత్త,పటిష్టమైన లెటర్ బాక్స్ ను ఏర్పాటు చేయాలి.
2. దానిని సురక్షితమైన,అందరికీ కనిపించే ప్రదేశంలో,పోస్టాఫీస్ గోడకు గట్టిగా బిగించాలి.
3. రోజూ సకాలంలో ఉత్తరాలను సేకరించేలా చర్యలు తీసుకోవాలి.
4. ఈ నిర్లక్ష్యంపై బాధ్యులైన సిబ్బందిపై విచారణ జరపాలి.
కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖను ఆధునీకరిస్తున్నామని చెబుతున్న వేళ, క్షేత్రస్థాయిలో ఇలాంటి దుస్థితి ఉండటం సిగ్గుచేటని,ఇది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే చర్యగా స్థానిక ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.

