*దొమ్మాట శ్రీకాంత్ గౌడ్ కు “సాహిత్య మిత్ర” ప్రశంసా పత్రం*
*చిలిపిచెడ్, మెదక్ జిల్లా, సెప్టెంబర్ 20 (ప్రజావాణి):*
హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రగతి నగర్ లో గల సుందరయ్య భవన్ లో భవాని సాహిత్య వేదిక వ్యవస్థాపకులు వైరాగ్యం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారత స్థాయి కవి సమ్మేళనం మరియు “యుద్ధం మొదలయ్యింది” కవితా సంకలన పుస్తకావిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
సమాజంలో పెరుగుతున్న మారకద్రవ్యాల దుష్ప్రభావాలపై, యువత పెడదోవ పట్టడంపై చిలిపిచెడ్ మండలం జగ్గంపేట గ్రామానికి చెందిన యువ కవి దొమ్మాట శ్రీకాంత్ గౌడ్ రాసిన చైతన్యవంతమైన కవిత ఎంతో ఆకట్టుకుంది. సామాజిక స్పృహతో, యువతలో జాగృతి కలిగించే విధంగా రాసినందుకు గాను ఆయనకు వేదికపై *”సాహిత్య మిత్ర ప్రశంసా పత్రం”* అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శతాధిక గ్రంథకర్త, తెలంగాణ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ డా. పి.ఎస్. రాములు, నేటి నిజం దినపత్రిక సంపాదకులు పైసా దేవదాసు, తంగేడు సాహిత్య మాస పత్రిక సంపాదకులు కాంచనపల్లి గోవర్ధన రాజు, ప్రముఖ సినీ గీత రచయిత, ఆంధ్రప్రదేశ్ బంగారు నంది అవార్డు గ్రహీత సాధనాల వెంకట స్వామి నాయుడు, ప్రముఖ కవయిత్రి వనజ బలుసాని, తొలి మహిళా సినీ దర్శకురాలు నాగశ్రీ బాలధరి తదితర సాహితీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, దొమ్మాట శ్రీకాంత్ గౌడ్ లాంటి యువ కవులు సమాజంలోని రుగ్మతలపై కలం ఎత్తడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ప్రశంసా పత్రం అందుకున్న అనంతరం శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, తనను ప్రోత్సహించిన భవాని సాహిత్య వేదికకు, తనకు అండగా నిలిచిన గురువులకు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఘనత సాధించిన శ్రీకాంత్ గౌడ్ కు చిలిపిచెడ్ మండల ప్రజలు, జగ్గంపేట గ్రామస్తులు, యువకులు మరియు సాహితీ మిత్రులు అభినందనలు తెలిపారు.

