దళితులపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలి
బీఆర్ఎస్ నాయకుల తీరుపై పానుగంటి మహేష్ కుమార్ ఆగ్రహం
మేడ్చల్: దళితులపై వివక్ష చూపే చర్యలను తీవ్రంగా ఖండించాలని ఏ బ్లాక్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు పానుగంటి మహేష్ కుమార్ అన్నారు. దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్పై బీఆర్ఎస్ నాయకులు తాత మధు, నరేందర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలకు నిరసనగా దళితులు డప్పు చప్పుళ్లతో నిరసన కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. అయితే, నిరసనలో పాల్గొన్న దళితులు వెళ్లిన ప్రదేశాన్ని పసుపు నీటితో శుభ్రం చేశారంటూ వస్తున్న ఆరోపణలు తీవ్రంగా బాధించాయని మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళితులపై వివక్ష, అహంకారపూరిత వైఖరిని విడనాడాలని ఆయన బీఆర్ఎస్ నాయకులను డిమాండ్ చేశారు. దళిత కాలనీల్లోకి వచ్చి వివక్ష చూపే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. ఈ ఘటనపై దళిత సంఘాలు, ప్రజా సంఘాలు స్పందించి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
దళిత సమాజాన్ని అవమానించే చర్యలకు ప్రజాస్వామ్య పద్ధతుల్లో తగిన సమాధానం చెప్పాలని మహేష్ కుమార్ కోరారు.

