*జనగాం పట్టణంలోని పలు ప్రాంతాల్లో మలాథియాన్ ఆయిల్ స్ప్రేయింగ్*
జనగామ జిల్లా ప్రతినిధి , సెప్టెంబర్ 19(ప్రజావాణి):
జనగాం పురపాలక సంఘం పరిధిలో దోమల నివారణ మరియు ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో మలాథియాన్ ఆయిల్ స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు.
పట్టణంలోని నివాస ప్రాంతాలు, మురుగు కాలువలు, నీరు నిలిచే ప్రదేశాలు, దోమల ఉత్పత్తికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తించి ఆయిల్ స్ప్రేయింగ్ చేపట్టారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను నియంత్రించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మరియు కమిషనర్ మాట్లాడుతూ, ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పురపాలక సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య, దోమల నియంత్రణ కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు.
పట్టణంలోని అవసరమైన ప్రాంతాల్లో దశలవారీగా మలాథియాన్ ఆయిల్ స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు.

