మన్నెంపల్లిలో ఉద్రిక్తత
నోటీసులు ఇవ్వకుండా పాత గ్రామపంచాయతీ కూల్చివేతకు అధికారుల యత్నం
అడ్డుకున్న సర్పంచ్ పాలకవర్గం.. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేత
కరీంనగర్,సెప్టెంబర్ 19 (ప్రజావాణి)
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో పాత గ్రామపంచాయతీ భవనం కూల్చివేత సందర్భంగా శనివారం ఉద్రిక్తత నెలకొంది. నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని కూల్చేందుకు అధికారులు రావడంతో సర్పంచ్ సునీతతో పాటు పాలకవర్గం అడ్డుకుంది.
ప్రొసీజర్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సర్పంచ్ సునీత ఆరోపించారు. మరోవైపు కలెక్టర్ ఆదేశాల మేరకే భవనం కూల్చేందుకు వచ్చామని అధికారులు తెలిపారు. గతంలో పాత గ్రామపంచాయతీ భవనాన్ని కూల్చకుండా ఇతర గ్రామపంచాయతీ అవసరాలకు వినియోగించుకోవాలని తమకు సూచించారని పాలకవర్గ సభ్యులు తెలిపారు.ఈ క్రమంలో అధికారులు, పాలకవర్గం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తిమ్మాపూర్ సర్కిల్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కూల్చివేతను అడ్డుకున్న సర్పంచ్ భర్త పొన్నం అనిల్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు.అదే సమయంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉన్న పురుగుల మందు తాగి చనిపోతానని సర్పంచ్ పేర్కొనడంతో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అనంతరం పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు పాత గ్రామపంచాయతీ భవనాన్ని కూల్చివేశారు.

