ఘట్కేసర్, సెప్టెంబర్ 14 (ప్రజావాణి): వినాయక చవితి సందర్భంగా వినాయక నవరాత్రుల తొలి రోజు ఘట్కేసర్ 6వ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఘట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముల్లిపావని జంగయ్య యాదవ్ సందర్శించారు. మండపాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆయా ప్రాంతాలకు వెళ్లి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వినాయకుడిని దర్శించుకుని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. వినాయక నవరాత్రులను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించుకోవాలని మండపాల నిర్వాహకులకు సూచించారు.
గణేష్ ఉత్సవాల నిర్వహణలో నిర్వాహకులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ముల్లిపావని జంగయ్య యాదవ్ తెలిపారు. కార్యక్రమాల్లో వివిధ కాలనీలకు చెందిన వినాయక మండపాల నిర్వాహకులు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


