కోదాడలో ఘనంగా మెగా జాబ్ మేళా:
ప్రారంభించిన మంత్రి ఉత్తమ్, స్పీకర్ ప్రసాద్ కుమార్, చైర్మన్ సుఖేందర్ రెడ్డి.
కోదాడ, సెప్టెంబర్ 19/ ప్రజావాణి
స్థానిక సీసీ రెడ్డి కాన్వెంట్ ఆవరణలో శనివారం నిర్వహించిన భారీ మెగా జాబ్ మేళా అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఈ ఉపాధి నియామక కార్యక్రమాన్ని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు.కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పలువురు కీలక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మేళాకు గౌరవ అతిథులుగా ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు హాజరై నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఇలాంటి వేదికలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కొనియాడారు.ఈ సందర్భంగా వివిధ ప్రముఖ కంపెనీల ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబరిచి, ఉద్యోగాలకు ఎంపికైన పలువురు అభ్యర్థులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఇతర ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆఫర్ లెటర్లను (ఉద్యోగ నియామక పత్రాలను) అందజేశారు
. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఈ మెగా జాబ్ మేళాకు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు. అభ్యర్థుల తాకిడితో జాబ్ మేళా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

