40 ఏళ్ల అండర్గ్రౌండ్ జీవితానికి స్వస్తి
– కాకర్ల సమత లొంగుబాటు.
*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)*:-
దాదాపు 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న సీపీఐ మావోయిస్టు సీనియర్ నాయకురాలు కాకర్ల సమత అలియాస్ మాధవి, షకీలా, దుర్గా ములుగులో డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఆమెకు ప్రభుత్వ పునరావాస నిధుల కింద రూ.20 లక్షల చెక్ ను డీజీపీ అందజేశారు.
1985లో అండర్గ్రౌండ్లోకి వెళ్లిన సమత.. హైదరాబాద్, నల్లమల, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు నిర్వహించారు. పార్టీ జనరల్ సెక్రటరీ గణపతికి సీసీ స్టాఫ్ మెంబర్గా కూడా పనిచేశారు.
*సరెండర్ అయిన వారికి ప్రభుత్వం అండ:*
సరెండర్ అయిన వారికి ఉపాధి, శిక్షణ, రుణాలు, ఉచిత వైద్యం కోసం ఆరోగ్య రక్షణ కార్డులు అందిస్తున్నామని డీజీపీ చెప్పారు. వారు గౌరవప్రదంగా జీవించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు.
*గణపతి దంపతులకు పిలుపు:*
మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఆయన భార్యతో పాటు అండర్గ్రౌండ్లో ఉన్న సీనియర్ నాయకత్వం హింసా మార్గాన్ని వీడి లొంగిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
*ఆపరేషన్ కగార్ ఫలితం:*
ఆపరేషన్ కగార్తో తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలైన కర్రెగుట్టలను భద్రతా బలగాలు జల్లెడ పట్టడంతో నేడు ఆ ప్రాంతంలో అభివృద్ధికి బాటలు పడుతున్నాయని డీజీపీ అన్నారు. త్వరలో ఈ ప్రాంతాన్ని అటవీశాఖతో కలిసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మల్టీజోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయ, రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, సీఆర్పీఎఫ్ ఏడీజీ విక్రమ్ సింగ్, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ తదితరులు పాల్గొన్నారు.

