హుజూర్నగర్ గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.
గ్రంథాలయ అభివృద్ధికి రూ.2 లక్షలు కేటాయింపు,
365 రోజులు గ్రంథాలయం తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం.
హుజూర్నగర్ ఆగస్టు 12 (ప్రజావాణి)
హుజూర్నగర్ శాఖా గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రంథాలయంలోని వసతులను పరిశీలించిన కలెక్టర్. విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
గ్రంథాలయంలో స్టడీ చైర్లు, లైటింగ్ తదితర మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. గ్రంథాలయ అభివృద్ధి కోసం రూ.2 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు గ్రంథాలయాన్ని 365 రోజులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, ఎమ్మార్వో కవిత, లైబ్రరీ ఇన్చార్జి శ్రీధర్ రెడ్డి, సిబ్బంది మధు, నిరుద్యోగ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

