*మహబూబాబాద్ కలెక్టరేట్ వేదికగా సమన్యాయం…ఎస్పీ సంచలన నిర్ణయం.. ‘ ఖాకీ ’ ఇమేజ్ను పెంచిన హుందాతనం!*
సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై నిమిషాల వ్యవధిలోనే స్పందించిన ఎస్పీ డాక్టర్ శబరీష్.
విచారణ ముగిసే వరకు ‘ సిఐ రఘుపతి ’ విధులకు దూరం.. డీఎస్పీకి దర్యాప్తు బాధ్యతలు.
అటు చట్టం.. ఇటు విద్యార్థుల హక్కు… పోలీస్ శాఖ సమయస్ఫూర్తిపై సర్వత్రా హర్షం.
మహబూబాబాద్, (కేసముద్రం) ఆగష్టు 20,ప్రజావాణి.
శాంతిభద్రతల పరిరక్షణ ఒకవైపు.. ప్రజాస్వామ్య నిరసనల పట్ల గౌరవం మరోవైపు! ఈ రెండింటి మధ్య సమతుల్యతను కాపాడుతూ మహబూబాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిన్న ఉదయం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా సందర్భంగా చోటుచేసుకున్న అనూహ్య ఘటనపై జిల్లా ఎస్పీ శబరీష్ స్పందించిన తీరు, శాంతిభద్రతల పరిరక్షణలో డిపార్ట్మెంట్ చూపిన హుందాతనానికి అద్దం పడుతోంది. ఉద్రిక్త సమయాల్లోనూ చట్టం తన పని తాను చేసుకుపోతుందని నిరూపిస్తూ, క్షేత్రస్థాయిలో శాంతిని నెలకొల్పిన అధికారుల సమయస్ఫూర్తిపై అన్ని వర్గాల నుండి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.జీవో 97కు వ్యతిరేకంగా విద్యార్థులు శాంతియుతంగా తమ ఆవేదనను ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు కలెక్టరేట్ ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా వారిని నియంత్రించే క్రమంలో.. విధి నిర్వహణలో ఉన్న టౌన్ (ఎస్ హెచ్ ఓ) సీఐ రఘుపతి రెడ్డి ప్రవర్తనకు సంబంధించిన కొన్ని దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో మరియు పత్రికల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. విధి నిర్వహణలో ఒత్తిడి సహజమే అయినప్పటికీ, విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో జిల్లా పోలీస్ లీడర్షిప్ అత్యంత వేగంగా, పారదర్శకంగా రంగంలోకి దిగింది.
*జర్నలిజం సాక్షిగా.. నిష్పాక్షిక విచారణ.*
నాల్గవ స్తంభంగా జర్నలిజం ఎత్తిచూపిన వాస్తవాలను, సమాజంలో తలెత్తిన ఆందోళనను గౌరవిస్తూ.. ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి నిజానిజాలను క్షుణ్ణంగా వెలికితీసేందుకు ఎస్పీ గారు తక్షణ నిర్ణయం తీసుకున్నారు. ఎవరికీ ఎలాంటి పక్షపాతం జరగకూడదనే ఉద్దేశంతో ఒక (డీఎస్పీ) స్థాయి ఉన్నతాధికారిని ప్రత్యేక విచారణాధికారిగా నియమించారు. అంతేకాకుండా, ఈ అంతర్గత విచారణ అత్యంత పారదర్శకంగా, ఎటువంటి బాహ్య ప్రభావాలు లేకుండా సాగాలనే ఉన్నత ఆశయంతో.. సదరు ఎస్ హెచ్ ఓ రఘుపతి రెడ్డిని విచారణ పూర్తయ్యే వరకు విధులకు తాత్కాలికంగా దూరంగా ఉంచుతూ ఆదేశాలు జారీ చేశారు.
*పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచిన నిర్ణయం.*
ఉద్వేగపూరిత వాతావరణంలో సైతం జిల్లా పోలీస్ యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం అటు విద్యార్థి లోకానికి ‘న్యాయం జరుగుతుందనే’ గట్టి నమ్మకాన్ని ఇవ్వగా, ఇటు పోలీస్ శాఖ నిష్పాక్షికతను చాటిచెప్పింది. తప్పు-ఒప్పులను నిర్ధారించే బాధ్యతను చట్టబద్ధమైన విచారణకు అప్పగించి, డిపార్ట్మెంట్ గౌరవాన్ని కాపాడటంలో అధికారులు చూపిన చొరవ అభినందనీయం. డీఎస్పీ స్థాయి అధికారి సమర్పించే అధికారిక ఎంక్వయిరీ రిపోర్ట్ ఆధారంగా తదుపరి శాఖాపరమైన చట్టబద్ధ చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఏది ఏమైనా, సమస్యను సున్నితంగా పరిష్కరించి, చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపించిన ఈ ఉదంతం జిల్లా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.
మహబూబాబాద్ కలెక్టరేట్ వేదికగా సమన్యాయం…ఎస్పీ సంచలన నిర్ణయం.. ‘ ఖాకీ ’ ఇమేజ్ను పెంచిన హుందాతనం..!
RELATED ARTICLES

