దేశంలో మార్పు కోసం సీపీఐ దేశవ్యాప్త పోరాటం….సెప్టెంబర్ 1న ఢిల్లీలో మహాధర్నా..
ఘట్కేసర్, ఆగస్టు 8: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా, దేశంలో మార్పు కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త పోరాటానికి శ్రీకారం చుట్టనున్నట్లు సీపీఐ ఘట్కేసర్ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్ తెలిపారు. శనివారం ఘట్కేసర్ జీహెచ్ఎంసీ పోచారం సర్కిల్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప వద్ద దేశవ్యాప్త పోరాటానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా లొట్టి ఈశ్వర్, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కల్లూరి జైచంద్ర మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల యువత, విద్యార్థులు, కార్మికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా ఇంటింటికీ కరపత్రాల పంపిణీ, ప్రజా ప్రచార కార్యక్రమాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద భారీ మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగే ఈ పోరాటంలో ప్రజలు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బి. శ్రీనివాస్, ఈ. బాల నరసింహ, ఎం.ఎస్. చారి, డి. యాదవ్, రాము, మల్లేశం, డి. ఆనంద్, రోహిత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

