
అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు ప్రతీకగా రాఖీ పండుగ
పోత్కపల్లి/పెద్దపల్లి ఆగస్టు27 ప్రజావాణి :
ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఓదెల ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేవైఎం పెద్దపల్లి జిల్లా నాయకులు పుల్లూరి పృథ్విరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థినులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు సోదరులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీకగా రక్షాబంధన్ పండుగ నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పుల్లూరి పృథ్విరాజ్ మాట్లాడుతూ “నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష.. మనమిద్దరం కలిస్తే ఈ దేశానికి, ధర్మానికి రక్ష” అని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు యువతలో దేశభక్తి, ఐకమత్యం, సోదరభావం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.
రక్షాబంధన్ పండుగ కేవలం అన్నాచెల్లెళ్ల అనుబంధానికే పరిమితం కాకుండా సమాజంలో పరస్పర గౌరవం, బాధ్యత, సోదరభావాన్ని పెంపొందించే సందేశాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. విద్యార్థులు మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ వాటి గొప్పతనాన్ని ఇతరులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పులి కొమరయ్య, రెడ్డి శంకర్, గొడుగు బిక్షపతి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మేడద్దుల రాజు, పవన్, కుమార్, కళ్యాణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలు, కళాశాలలో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకలు విద్యార్థుల్లో ఆనందోత్సాహాలను నింపాయి.

