కళ్యాణ లక్ష్మిపై బీఆర్ఎస్ ధర్నా.. రాజకీయ రగడ

“పథకం ఆపేశారని ఆధారం చూపండి” – యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లవంగు రాకేష్ వంజరి
మేడ్చల్: కళ్యాణ లక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందంటూ బీఆర్ఎస్ నాయకులు మేడ్చల్ MRO కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసిందంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తున్నారని మేడ్చల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లవంగు రాకేష్ వంజరి ఆరోపించారు.
పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని రాజకీయ అంశంగా మార్చడం సరికాదని ఆయన అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం అందేలా ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందన్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో పేదల సమస్యలను పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం గుర్తుకు రావడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని రాకేష్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న బిల్లులు, పథకాల పరిస్థితిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులపైనే ఉందన్నారు.
ఆధారం ఎక్కడ?
“కళ్యాణ లక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు అందుకు ఆధారం చూపాలి. ఏ GO ద్వారా పథకాన్ని రద్దు చేశారో వెల్లడించాలి. ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తూ పేదల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదు” అని లవంగు రాకేష్ వంజరి ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. మేడ్చల్ ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, రాజకీయ డ్రామాలకు స్వస్తి పలికి నిజమైన ప్రజా సమస్యలపై పోరాడాలని బీఆర్ఎస్ నాయకులకు సూచించారు.

