ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని జాతీయ రహదారి నుంచి డబిల్పూర్ కమాన్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వర్షం కురిసిన సమయంలో గుంతల్లో నీరు నిలిచి చెరువులను తలపిస్తుండటంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడే పరిస్థితి నెలకొంది.
ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, లారీలు, పలు సీడ్ కంపెనీల బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. భారీ వాహనాల రాకపోకలతో రహదారిపై ఉన్న గుంతలు మరింత పెద్దవిగా మారుతున్నాయి. గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోతుండటంతో పాటు వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
ప్రధాన రహదారిపై ఇలాంటి పరిస్థితి నెలకొన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే మున్సిపల్ అధికారులు స్పందించి గుంతలను పూడ్చి రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కమిషనర్ గారూ.. ఇకనైనా స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టి వాహనదారుల కష్టాలు తీర్చాలని వారు కోరుతున్నారు.

