.ప్రధాన కాలువలు ఎండిపోతున్న పంట పొలాలు.
ములుగు జిల్లా ప్రతినిధి శ్రీకాంత్(ప్రజావాణి)
గోవిందరావుపేట మండలం లక్నవరం చెరువు ఆయకట్టు పరిధిలో రైతుల కష్టాలు తీవ్రమయ్యాయి. వరి నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా వర్షాలు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి.
ఎకరాకు ఇప్పటికే 15 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు పంట నష్టపోతామనే భయంతో మనోధైర్యం కోల్పోతున్నారు. “నాట్లు వేసిన పంట కళ్ళముందే ఎండిపోతుంటే గుండె తరుక్కుపోతోంది” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోపక్క లక్నవరం – రాంపూర్ కోట ప్రధాన కాలువ దయనీయ స్థితిలో ఉంది. కాలువ మొత్తం గడ్డి, నాచు, తుంగతో పాటు అనేక రకాల చెట్లతో నిండిపోయింది. దశాబ్దాలుగా మరమ్మత్తులు లేకపోవడంతో కాలువ పూర్తిగా మూసుకుపోయింది.
లక్నవరం చెరువులో ఇప్పటికీ 23 ఫీట్ల నీటి సామర్థ్యం ఉంది. జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేస్తే పంటలు గట్టెక్కే అవకాశం ఉంది. కానీ ప్రధాన కాలువల పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో నీరు పొలాలకు చేరే పరిస్థితి లేదు.
దీంతో లక్నవరం ఆయకట్టు రైతులు, రాంపూర్ కోట కాలువ రైతులు ప్రభుత్వానికి, జిల్లా ప్రజా ప్రతినిధులకు, నీటి పారుదల శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
వెంటనే స్పందించి నిధులు కేటాయించి కాలువల మరమ్మత్తులు చేయించాలని, లక్నవరం నీటిని విడుదల చేసి పంట పొలాలను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే వేలాది ఎకరాల్లో పంట పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

