ఘట్కేసర్, ఆగస్టు 15 (ప్రజా వాణి): ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రేవంత్ అన్న టీం సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వెంటనే స్పందించారు. తన సొంత నిధులతో రూ.70 వేల విలువైన అత్యాధునిక సౌండ్ బాక్సులు, మైకుల సెట్ను కొనుగోలు చేసి పాఠశాలకు విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రార్థనా సమావేశాలు, ఇతర విద్యా కార్యక్రమాల నిర్వహణకు సౌండ్ సిస్టమ్ ఎంతో అవసరమని తెలిపారు. పాఠశాల అవసరాన్ని తెలుసుకున్న వెంటనే ఎలాంటి సంకోచం లేకుండా రూ.70 వేల విలువైన నాణ్యమైన పరికరాలను సొంత ఖర్చులతో అందించిన శ్రీకాంత్ రెడ్డి సేవా దృక్పథం అభినందనీయమన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, పాఠశాల అభివృద్ధి పట్ల ఆయన చూపుతున్న చొరవ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల తరఫున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎం టీ ప్రతాప్ రెడ్డి, రాందాస్, భాషయ్య, మాజీ సర్పంచ్ నరసింహ గౌడ్, ఎఎంఏఈశ్వరి, పీఈటీ విజయ్ కుమార్, రాజు, రాకేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నానావత్ రెడ్యానాయక్, మాజీ సర్పంచ్ చిన్న నరసింహులు గౌడ్, నాయకులు నల్లవెల్లి శేఖర్ ముదిరాజ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

